ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి 31న ప్రస్తుత డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో హరీశ్ కుమార్ గుప్తాను తదుపరి డీజీపీగా నియమించారు.1992 బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తా ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో హరీష్ గుప్తాను ఎన్నికల కమిషన్ డీజీపీగా నియమించిన విషయం తెలిసిందే. దీంతో కొన్నిరోజులపాటు ఆయన ఆ పోస్టులో కొనసాగారు.
ఆ తర్వాత టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చాక తిరుమల రావును డీజీపీగా నియమించింది. ఆయన ఈ నెల 31న రిటైర్ కానున్నారు. కాగా, హరీష్ కుమార్ గుప్తా జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి చెందినవారు. ఆయన గతంలో పలు జిల్లాలకు ఎస్పీగా కూడా పనిచేశారు. కొత్త డీజీపీ రేసులో మాదిరెడ్డి ప్రతాప్ కూడా ఉన్నప్పటికీ.. హరీష్ కుమార్ గుప్తానే ఆ పదవి వరించింది. నరసరావుపేటలో డీజీపీ తిరుమలరావు పర్యటన నరసరావుపేటలో పర్యటించిన డీజీపీ ద్వారకా తిరుమలరావు.. జిల్లా కేందరంలో నూతనంగా నిర్మించిన డాగ్ స్క్వాడ్, జిల్లా పెరేడ్ గ్రౌండ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో తమకు ప్రస్తుతం ఐదారు ప్రధాన అంశాలు లక్ష్యంగా ఉన్నాయన్నారు. ఇటీవల కాలంలో ఫేక్ పోలీసులు, కోర్టులు, లాయర్లు అమాయకులకు ఫోన్లు చేసి డబ్బులు గుంజుతున్నారన్నారు. రాష్ట్రంలో గంజాయి స్మగ్లింగ్ ను పూర్తిగా అరికడతామన్నారు.
సైబర్ క్రైం రూపంలో దోపిడీ ఎక్కువగా జరుగుతోందని డీజీపీ తిరుమలరావు తెలిపారు. టెక్నాలజీని వాడుకుని సాధ్యమైనంత ఎక్కువగా వాటిని అరికట్టాలన్నారు. కొత్తగా సోలార్ ప్యానల్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. శాంతిభద్రతల విషయంలో టెక్నాలజీని వాడుకుంటే మంచి ఫలితాలుంటాయన్నారు.
Leave feedback about this