Maha Kumbh: ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక మహా కుంభమేళాలో తొక్కిసలాట ఘటన మరువకముందే మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సెక్టార్ 22లో ఛట్నాగ్ ఝూన్సీ ప్రాంతంలో నిర్మించిన టెంట్ సిటీలో గురువారం మధ్యాహ్నం మంటలు చెలరేగడంతో.. దాదాపు 15 గుడారాలు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రమాదం జరగలేదని అధికారులు పేర్కొన్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మహా కుంభమేళా ప్రారంభమైన 18 రోజుల వ్యవధిలోనే అక్కడ అగ్నిప్రమాదం జరగడం ఇది మూడోసారి కావడం గమనార్హం. 11 రోజుల క్రితం రెండు గ్యాస్ సిలిండర్లు పేలడంతో భారీగా మంటలు వ్యాపించగా.. ఈ ప్రమాదంలో 18 టెంట్లు దగ్ధమయ్యాయి. ఆ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పొగలు భారీగా వ్యాపించడంతో అఖాడాలా సమీపంలో భయాందోళన నెలకొంది. అనంతరం వారం రోజులకే ఈ నెల 25న మరో అగ్నిప్రమాదం జరిగింది. కుంభమేళాకు వెళ్లే ప్రధాన రహదారిలోని సెక్టార్-2 సమీపంలోని పార్కింగ్ ఏరియాలో మంటలు చెలరేగగా.. ఓ కారు పూర్తిగా దగ్ధమైంది. మరో కారు పాక్షికంగా దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు.
Leave feedback about this