ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు హాజరయ్యారు. ఇవాళ మధ్యాహ్నం ప్రయాగ్ రాజ్ చేరుకున్న పవన్.. సతీమణి అన్నా లెజ్నెవా, కుమారుడు అకీరా నందన్ తో కలిసి పుణ్యస్నానం ఆచరించారు. ఈ సందర్భంగా పవన్ తో పాటు కుటుంబ సభ్యులకు స్థానిక పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. కుంభమేళాలో తొక్కిసలాటలు, అవాంఛనీయ ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో పవన్ కు పుణ్యస్నానం పూర్తయ్యే వరకూ రక్షణగా నిలిచారు.
మహాకుంభమేళాకు ఏపీలో వీఐపీలు క్యూ కడుతున్నారు. ఈ నెల 26తో కుంభమేళా ముగియనున్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా ప్రయాగ్ రాజ్ కు వెళ్లి పుణ్యస్నానాలు చేసేందుకు బయలుదేరి వెళ్తున్నారు. ఇదే క్రమంలో మంత్రి నారా లోకేష్ దంపతులు తాజాగా కుంభమేళాకు వెళ్లారు. ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దంపతులు పుణ్యస్నానాలు ఆచరించారు. మెడలో జంధ్యం వేసుకున్న పవన్ కళ్యాణ్.. రష్యన్ భార్య అన్న లెజ్ నోవాతో కలిసి పుణ్యస్నానం చేశారు. వీరితో పాటు టాలీవుడ్ దర్శకుడ, పవన్ కు సన్నిహితుడైన త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా అక్కడే ఉన్నారు. అలాగే కొడుకు అకీరా నందన్ కూడా ఉన్నారు.
తాజాగా ఆధ్యాత్మిక పర్యటనలు చేస్తున్న పవన్ కళ్యాణ్ కుంభమేళాకు వెళ్లి పుణ్యస్నానాలు ఆచరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. పవన్ రాక సందర్భంగా ప్రోటోకాల్ ప్రకారం ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. పవన్ నదిలో దిగిన తర్వాత కూడా పోలీసులు, భద్రతా సిబ్బంది ఆయన చుట్టూ ఉన్నారు. యూపీలో యోగీ ప్రభుత్వం పవన్ భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చినట్లు దీన్ని బట్టి అర్దమవుతోంది. ఇప్పటికే సనాతన ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారిన పవన్ .. ఆలయాల పర్యటనలతో పాటు కుంభమేళాకు హాజరు కావడం చర్చనీయాంశమవుతోంది.

Leave feedback about this