Chandrababu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. రెండు రోజుల ఈ పర్యటన కోసం బుధవారమే హస్తినకు చేరుకున్నారాయన. కేంద్ర మంత్రులతో సమావేశం అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల గురించి చర్చించారు.
నితిన్ గడ్కరీతో భేటీ ముగిసిన తరువాత చంద్రబాబు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జనాభా పెరుగుదల, ఎక్కువమంది పిల్లలను కనడంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు చంద్రబాబు. ఉత్తరప్రదేశ్, బీహార్లల్లో అధిక జనాభా ఉండటం సమస్యే కాదని, స్వాగతించదగ్గ విషయమని అన్నారు. అధిక జనాభాను కలిగివుండటం దేశానికి ప్రయోజనకరమని వ్యాఖ్యానించారు. త్రిభాషా ఫార్ములాను వ్యతిరేకిస్తూ తమిళనాడు చేపట్టిన ఉద్యమాలపై మాట్లాడారు చంద్రబాబు. దీన్ని తప్పుపట్టారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వాదనలను విభేదించారు. హిందీ నేర్చుకోవడం ఎంతో మంచిదని వ్యాఖ్యానించారు. దీనివల్ల దేశ ప్రజలతో కలిసి పోవచ్చని అన్నారు. హిందీ వస్తే దేశంలో ఎక్కడికైనా వెళ్లొచ్చని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో రాణాంచాలంటే ఇంగ్లీష్ భాషను నేర్చుకోవాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నానని, ఏపీలో తెలుగును మాతృభాషగా ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు. మూడు భాషలే కాదు, పలు భాషలను నేర్చుకోవడాన్ని సమర్థిస్తానని చంద్రబాబు తేల్చి చెప్పారు.
తమిళనాడులో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సారథ్యంలో అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వం- నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ- 2020ని విభేదిస్తోన్న విషయం తెలిసిందే. దీని ప్రకారం త్రిభాషా ఫార్ములాను అమలు చేయాల్సి ఉంటుంది. తమిళనాడులో జాతీయ నూతన విద్యా విదానాన్ని అమలు చేసి, త్రిభాషా ఫార్ములాను ప్రవేశపెట్టేంత వరకు సమగ్ర శిక్ష కార్యక్రమం కింద నిధులు అందించబోమంటూ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. దీనిపై వివాదం చెలరేగింది. తమిళులు అలాంటి బ్లాక్మెయిల్ రాజకీయాలను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోరంటూ స్టాలిన్ తేల్చి చెప్పారు. రాజ్యాంగంలోని ఏ నిబంధన త్రిభాషా సూత్రాన్ని తప్పనిసరి చేసిందంటూ నిలదీస్తోన్నారు. దీనిపై దక్షిణాది రాష్ట్రాలను ఏకీకృతం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు.

Leave feedback about this