June 8, 2025
భక్తి

టీటీడీ శ్రీవారి ఆలయంలో ఉద్యోగి చేతివాటం-6 లక్షల విదేశీ కరెన్సీ స్వాహా..!

భక్తుల ఆరాధ్య దైవం తిరుమల శ్రీవారిని వివాదాలు వీడటం లేదు. కల్తీ నెయ్యి ఆరోపణలతో మొదలైన వివాదాలు ఇప్పుడు హుండీ లెక్కింపులో దొంగతనాల వరకూ వచ్చాయి. అయితే ఈసారి తిరుమల ఆలయంలో కాకుండా చెన్నైలోని శ్రీవారి ఆలయంలో అపచారం చోటు చేసుకుంది. భక్తులు వెంకన్నకు ఇచ్చిన నగదు కానుకల్లో టీటీడీ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించాడు. దీంతో ఆలస్యంగా గుర్తించిన టీటీడీ అతన్ని సస్పెండ్ చేసింది.

చెన్నైలోని టీటీడీ శ్రీవారి ఆలయంలో పరకామణిలో లెక్కింపులో అవకతవకలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు వచ్చాయి. శ్రీవారికి సమర్పించిన హుండీ కానుకల్లో టీటీడీ ఉద్యోగి కృష్ణ కుమార్ చేతి వాటం ప్రదర్శించినట్లు తెలిసింది. హుండీ లెక్కింపులో సీనియర్ అసిస్టెంట్ కృష్ణ కుమార్ విదేశీ కరెన్సీని స్వాహా చేశాడు. గత సంవత్సరం ఒక నెలలో రూ.6 లక్షల విలువైన విదేశీ కరెన్సీని ఆయన స్వాహా చేసినట్లు విజిలెన్స్ విభాగం గుర్తించింది.

హుండీలో వచ్చిన విదేశీ కరెన్సీని ప్రతి నెల 1వ తేది తిరుమల పరకామణిలో జమ చేయాల్సి ఉంది. దీంతో విదేశీ కరెన్సీ లెక్కింపులో తేడాలు జరిగినట్లు టీటీడీ విజిలెన్స్ వింగ్ గుర్తించింది. సీనియర్ అసిస్టెంట్ కృష్ణ కుమార్ అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించిన విజిలెన్స్ వింగ్ .. ఈవో శ్యామలరావుకు నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా కృష్ణ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ఈవో శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు.

ఇప్పటికే వరుస వివాదాలతో తిరుమల శ్రీవారి ఆలయ ప్రతిష్ఠ మసకబారుతోంది. భక్తుల్లో ఎంతో నమ్మకం ఉన్న తిరుమల వెంకన్నకు దేశవ్యాప్తంగా ఆలయాలు ఉన్నాయి. వీటిలో ఎక్కడ ఏం జరిగినా టీటీడీయే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో హుండీ ఆదాయాన్ని సైతం సొంత ఉద్యోగులే కాజేస్తుంటే ఇక వీరి సంగతి తిరుమల వెంకన్నే చూసుకోవాల్సి ఉంటుందని భక్తులు మండిపడుతున్నారు.

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video