June 8, 2025
తాజా వార్తలు

క్షమాపణ చెప్పిన నారా లోకేష్

Nara Lokesh: కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం పరిధిలోని జ్యోతి మండలంలోని ప్రఖ్యాత అవధూత కాశిరెడ్డి నాయన ఆశ్రమం కూల్చివేత వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చెలరేగుతున్నాయి.

అవధూత కాశిరెడ్డి నాయన పరమపదించిన స్థలం ఇది. ఇక్కడ పురాతన లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం కూడా ఉంది. అటవీ శాఖ అధికారులు ఉన్నట్టుండి దీన్ని కూల్చివేశారు. ఇవి టైగర్ జోన్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వస్తాయంటూ ఆశ్రమం పరిధిలోని కొన్ని కట్టడాలను తొలగించారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ ఆశ్రమాన్ని సందర్శించారు. అవధూత కాశినాయన జ్యోతి క్షేత్రాన్ని పరిరక్షించుకుంటామని పార్టీకి చెందిన కడప జిల్లా అధ్యక్షుడు పీ రవీంద్రనాథ్‌ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్‌ సుధ, అధికార ప్రతినిధి ఆరె శ్యామల జ్యోతి క్షేత్రాన్ని సందర్శించారు.

పేదల ఆకలి తీర్చడానికి.. ఇటీవల జ్యోతిక్షేత్రంలో మహిళల స్నానపుగదులు, క్షౌరశాల, గోశాల, విశ్రాంతి గదులను అటవీశాఖ అధికారులు కూల్చివేసిన ప్రదేశాలను పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదల ఆకలి తీర్చడానికి దేవాలయాల వద్ద నిత్యాన్నదాన సత్రాలు ఏర్పాటు చేసి కాశినాయన అన్నదానం కొనసాగించారని అన్నారు.

జ్యోతిక్షేత్రంలో ఆయన పరిత్యాగం చెందారని, ఆయన ఆలయాన్ని నిర్మించడానికి అటవీశాఖ ఇబ్బందులు సృష్టించడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి, గోవిందరెడ్డి సహకారంతో జ్యోతి క్షేత్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని గుర్తు చేశారు. కూట‌మి ప్ర‌భుత్వ హ‌యాంలో విధ్వంసం.. రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వ హ‌యాంలో విధ్వంసం జ‌రుగుతోంద‌ని, ఆధ్యాత్మిక స్థలాలను కూల్చివేస్తోంటే సనాతన ధర్మాన్ని కాపాడతానన్న పిఠాపురం పీఠాధిపతి ఎక్కడికి వెళ్లాడ‌ని శ్యామల ప్ర‌శ్నించారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సొంత శాఖ అధికారులు కూల్చివేతకు దిగితే ఎందుకు నోరుమెదపడం లేద‌ని మండిప‌డ్డారు. రంగంలో దిగిన నారా లోకేష్..

రాజకీయ దుమారం చెలరేగిన తరువాత ఈ వ్యవహారంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. తక్షణమే దిద్దుబాటు చర్యలకు పూనుకున్నారు. కూల్చివేతలకు గల కారణాలను వివరించారు. కూల్చివేత పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చర్య బాధాకరమని వ్యాఖ్యానించారు. అటవీ నిబంధనలు ఉన్నా.. అటవీ భూములు, టైగర్ జోన్ నిబంధనల కారణంగా కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం నల్లమలలోని కాశీనాయన ఆశ్రమం అన్నదాన సత్రాన్ని అటవీ శాఖ అధికారులు కూల్చివేశారని, ఇది బాధాకరమని పేర్కొన్నారు. అటవీ నిబంధనలు ఉన్నా, భక్తుల మనోభావాలు గౌరవించి, అన్నదాన కార్యక్రమాలు జరిగే భవనాలను కూల్చకుండా ఉండాల్సిందని అన్నారు. క్షమాపణ చెబుతున్నా.. ఈ కూల్చివేతలకు ప్రభుత్వం తరఫున తాను క్షమాపణ చెబుతున్నానని చెప్పారు నారా లోకేష్. కూల్చివేతకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. త్వరలో తన సొంత నిధులతో అదే చోట అన్నదాన సత్రాన్ని పునర్నిర్మిస్తానని భరోసా ఇచ్చారాయన.

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video