June 8, 2025
భక్తి

తిరుమలలో మరో అపచారం

తిరుమలలో ఇటీవల వరుసగా కొన్ని అపచారాలు చోటు చేసుకుంటున్నాయి. శ్రీవారి లడ్డూ కల్తీ వివాదం గురించి అందరికి తెలిసిందే. శ్రీవారి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా తొలిరోజైన ధ్వజారోహణం నాడు, ధ్వజస్తంభం పై గరుడ ధ్వజ పటాన్ని ఎగురవేసే తాలూకు కొక్కి విరిగిపోయిందని, ఇది అపచారమని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.బ్రహ్మోత్సవాల తొలిరోజునే ఇలా జరిగిందేంటని భక్తులు చర్చించుకున్నారు.

ఇటీవలే మహారాష్ట్రకు చెందిన కొంతమంది భక్తులు చెప్పులు ధరించి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయ మహాద్వారం వరకు చేరుకున్నారు. భద్రతా సిబ్బంది మూడు చోట్ల తనిఖీలు చేసినప్పటికీ ఇది గుర్తించకపోవడం భద్రతా లోపాలను ఎత్తిచూపుతోంది. ఈ ఘటనపై టీటీడీ సీరియస్ చర్యలు తీసుకుంటూ ఏడుగురు సిబ్బందిని సస్పెండ్ చేసింది.తిరుమల ఆలయంపై విమానాలు ఎగరడం ఆగమ శాస్త్ర విరుద్ధం. అయితే, ఇటీవల తరచుగా విమానాలు ఆలయం మీదుగా వెళ్తున్నాయని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై టీటీడీ ఇప్పటికే కేంద్ర విమానయాన సంస్థకు లేఖ రాసింది. పాపవినాశనంలో ఫారెస్ట్ అధికారులు బోట్లను ఏర్పాటు చేయడం వివాదాస్పదంగా మారింది. ఇది పర్యాటక ప్రదేశం కాదని, పవిత్రమైన ఆధ్యాత్మిక స్థలమని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా తిరుమలలో మరో ఘటన చోటు చేసుకుంది. శ్రీవారి ఆలయ పరిసరాల్లో భక్తులు డ్రోన్‌ కెమెరా వినియోగించారు. మహారాష్ట్రకు చెందిన భక్తుడు దాదాపుగా 10 నిమిషాలు పాటు డ్రోన్‌ కెమెరా ద్వారా ఆలయం పరిసరాలను చిత్రీకరించారు. దీంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుడిని పట్టుకుని టీటీడీ విజిలెన్స్ అధికారులకు అప్పగించారు. విచారణ అనంతరం భక్తుడిని అరెస్ట్ చేశారు. ఈ వరుస ఘటనలు తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నాయని భక్తులు ఆందోళన చెందుతున్నారు. టీటీడీ ఈ విషయాలపై దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారుల బదిలీలు జరగడం కూడా కొంత గందరగోళానికి దారితీసిందని భావిస్తున్నారు. శాశ్వత సీవీఎస్వో లేకపోవడం కూడా భద్రతా చర్యలపై ప్రభావం చూపుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video