Kedarnath dham: దేవభూమిగా భాసిల్లుతున్న ఉత్తరాఖండ్లో వెలిసిన పుణ్యక్షేత్రాల్లో ఒకటి- కేదార్నాథ్. జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదారనాథుడిని దేశం నలుమూలల నుంచి ఏటా లక్షలాదిమంది దర్శించుకుంటుంటారు. కేదార్నాథ్తో కలిపి చార్ ధామ్ యాత్రల్లో పాల్గొంటుంటారు.
ఇప్పుడు తాజాగా కేదార్నాథ్ ఆలయం తలుపులు తెరచుకున్నాయి. ఈ ఉదయం సరిగ్గా 7 గంటలకు వేద మంత్రోచ్ఛారణల మధ్య అర్చకులు ఆలయం తలుపులను తెరిచారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేదారనాథుడికి తొలి పూజలు చేశారు.తొలుత ప్రధాన అర్చకుడు రావల్ భీమశంకర్ స్వామివారికి పూజలు నిర్వహించారు. ఆరు నెలల కిందట ఆలయం తలుపులను మూసివేసే సమయంలో మూలమూర్తికి అలంకరించిన పూజావస్తువులను తొలగించారు. తాజా పూలతో స్వామివారిని అలంకరించారు. ఆ తరువాత అఖండ జ్యోతిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రుద్రాభిషేకం నిర్వహించారు. శివాష్టకం, శివతాండవాష్టకం, కేదారాష్టక మంత్రాలతో ఆలయ ప్రాగణం మొత్తం ప్రతిధ్వనించింది. మొత్తం 2,500 మంది భక్తులు తొలి పూజల్లో పాల్గొన్నారు. కేదారేశ్వరుడి నామస్మరణ చేస్తూ అఖండ జ్యోతిని దర్శించుకున్నారు. అంతకుముందు- పంచముఖి విగ్రహాన్ని ఉఖిమఠ్లోని ఓంకారేశ్వర్ ఆలయం నుండి ఉత్సవంగా కేదార్నాథ్ ఆలయానికి తీసుకొచ్చారు. పల్లకీ సేవ నిర్వహించారు. విగ్రహాన్ని డోలిపై ఉంచే ముందు సాంప్రదాయ పంచ స్నానం కార్యక్రమాన్ని వైభవంగా పూర్తి చేశారు. తలుపులు తెరచుకోనున్న నేపథ్యంలో ఆలయ ప్రాంగణాన్ని పూలతో అందంగా అలంకరించారు. 13 టన్నుల పూలను దీనికోసం వినియోగించారు.
కేదార్నాథ్ ఆలయం తలుపు తెరచుకోవడంతో చార్ ధామ్ యాత్ర సీజన్ ప్రారంభమైనట్టయింది. యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలను చార్ ధామ్ క్షేత్రాలుగా పిలుస్తారు. భక్తుల కోసం ఆయా ఆలయాలన్నీ తెరచుకున్నాయి. గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాల పరిసరాల్లో అంటే 50 మీటర్ల వరకు రీల్స్ చేయడాన్ని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిషేధించింది. వీడియోలు తీయడంపైనా నిషేధం జారీ అయింది. 200 మీటర్ల పరిధిలో సెల్ ఫోన్ వినియోగంపై కూడా ఆంక్షలు అమలులో ఉన్నాయి. ఆలయం పునఃప్రారంభ వేడుకలను ఇందులో నుంచి మినహాయించారు. చార్ ధామ్ యాత్రపై ఉద్దేశపూరకంగా సోషల్ మీడియాను ఆధారంగా చేసుకుని తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేసే అవకాశం ఉన్నందు వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెప్పారు. వీడియోలు, సోషల్ మీడియా రీల్స్ చేసే వారిపై కఠిన చర్యలను తీసుకుంటామని హెచ్చరించారు.
ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ జిల్లాలో 3,583 మీటర్ల ఎత్తులో ఉంటుంది కేదార్నాథ్ ఆలయం. అత్యంత శక్తిమంతమైన ద్వాదశ పవిత్ర జ్యోతిర్లింగాలలో ఇదీ ఒకటి. ఈ ఆలయం అక్షయ తృతీయ (ఏప్రిల్-మే) నుండి దీపావళి (అక్టోబర్-నవంబర్) వరకు సంవత్సరంలో దాదాపు 6 నుండి 7 నెలల పాటు యాత్రికుల కోసం తెరిచి ఉంటుంది. ఈ సీజన్లో ఏటా దాదాపు 25 లక్షల మంది యాత్రికులు సందర్శిస్తారు.

Leave feedback about this