India Pakistan War: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో ఉగ్రవాదుల కిరాతక దాడి తరువాత అనూహ్య పరిణామలు ఏర్పడుతున్నాయి. ఈ దాడికి ప్రతీకారంగా కేంద్ర ప్రభుత్వం పలు నిర్ణయాలను తీసుకుంది. ఈ మారణహోమానికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే కారణం కావడం వల్ల ఆ దేశంపై కఠిన ఆంక్షలకు దిగింది.
అదే సమయంలో భారత్లో తిష్టవేసిన ఉగ్రవాదులు, స్లీపర్ సెల్స్ను ఏరివేసే పనిని మొదలుపెట్టింది కేంద్రం. అన్ని రాష్ట్రాల్లో ఏకకాలంలో విస్తృతంగా తనిఖీలు, సోదాలు చేపట్టింది. నిద్రాణంగా ఉంటూ వస్తోన్న ఉగ్రవాదులు, వారి సానుభూతిపరుల కోసం జల్లెడ పడుతోంది. పాకిస్తాన్తో యుద్ధం అంటూ మొదలైతే- అంతర్గతంగా ఎటువంటి ఉగ్రవాద దాడులూ సంభవించకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.
పాకిస్తాన్పై భారత్ యుద్ధానికి దిగినందుకు నిరసనగా ఉగ్రవాద సంస్థల సానుభూతిపరులు అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా కట్టుదిట్టంగా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టింది. మూడో కంటికి తెలియకుండా అన్ని రాష్ట్రాల్లో కూడా ఉగ్రవాదుల ఏరివేత ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ క్రియాశీలక సభ్యుడు అమ్మన్ యాసర్ పోలీసుల చేతికి చిక్కాడు. యాంటీ- టెర్రరిజం స్క్వాడ్, పోలీసులు నిర్వహించిన జాయింట్ ఆపరేషన్ సందర్భంగా అతను అరెస్ట్ అయ్యాడు. జార్ఖండ్ ఏటీఎస్ టీమ్ అతన్ని అరెస్ట్ చేసింది. గతంలో దశాబ్ద కాలం పాటు కారాగారంలో గడిపాడు యసర్. బయటికి వచ్చిన తరువాత కూడా ఉగ్రవాద కార్యకలాపాలను మానుకోలేకపోయాడు. ఇండియన్ ముజాహిదీన్ అనుబంధ సంస్థ హిజ్బ్ ఉత్-తహ్రీర్తో అసోసియేట్ అయ్యాడు. స్లీపర్ సెల్గా అతనికి గుర్తింపు ఉంది.
ఈసారి అతను హిజ్బుత్ తహ్రీర్తో అనుబంధం ద్వారా దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు పక్కా సమాచారం ఉందని జార్ఖండ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ అనురాగ్ గుప్తా తెలిపారు. యాసర్ గతంలో నిషేధిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ క్రియాశీలకంగా పనిచేశాడు. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు 2014లో జోధ్పూర్ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఈ కేసులో 10 సంవత్సరాలు జైలులో గడిపిన యాసర్ గత ఏడాది మేలో విడుదల అయ్యాడు. ఆ తర్వాత తన సహచరుడు అయాన్ జావేద్తో సహా హజ్బ్-ఉత్-తహ్రీర్తో అసోసియేట్ అయ్యాడు. అతని సహచరుడు అయాన్ జావేద్ను ఇదివరకే అరెస్ట్ అయ్యాడు. అతన్ని విచారించిన సందర్భంగా యాసర్ పేరు తెరమీదికి వచ్చింది.

Leave feedback about this