Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం నాడు 75,706 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 23,340 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.34 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఆరు కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.
రథ సప్తమి వేడుకలు తిరుమలలో అంగరంగ వైభవంగా ఆరంభం అయ్యాయి. సూర్యజయంతి సందర్భంగా సప్తవాహనాలపై ఊరేగనున్నారు శ్రీవారు. సూర్యప్రభ వాహనంతో ఈ ఉత్సవాలు మొదలయ్యాయి. ఈ తెల్లవారు జామున తిరుమల ఆనంద నిలయం వాయువ్య దిశలో ఉన్న మేదరమిట్ట మూలలో తొలుత సూర్యప్రభ వాహనాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చారు. సరిగ్గా 6:38 నిమిషాలకు సూర్య కిరణాలు వాహనాన్ని తాకాయి. దీనితో ఒక్కసారిగా గోవిందుడి నామస్మరణతో తిరుమలగిరులు మార్మోగిపోయాయి. ఆ వెంటనే అర్చకులు మలయప్ప స్వామివారికి ప్రత్యేకంగా హారతి ఇచ్చారు. నివేదనను సమర్పించారు. తిరిగి వాహనసేవ ప్రారంభమైంది. ఉదయం 9 గంటలకు చిన్నశేషవాహన సేవ ప్రారంభమౌతుంది. 11 గంటలకు గరుడవాహనంపై శ్రీవారు దర్శనం ఇవ్వనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటనుండి 2 వరకు- హనుమంత వాహనం, 2 నుండి 3 గంటల వరకు- చక్రస్నానం, సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు- కల్పవృక్ష వాహనం, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనం, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు- చంద్రప్రభ వాహనంపై స్వామివారు ఊరేగుతారు.
ఈ ఉత్సవాల నేపథ్యంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు, అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి అర్ధరాత్రి నాలుగు మాడవీధుల్లో ఏర్పాట్లను పరిశీలించారు. నాలుగు మాడా వీధుల్లో కలియతిరిగారు. ఏర్పాట్ల గురించి భక్తులను అడిగి తెలుసుకున్నారు.

Leave feedback about this