June 8, 2025
తాజా వార్తలు

సచివాలయాల ఉద్యోగుల విభజన, విధులు- ఆ 40వేల మంది ఇక…!!

ఏపీ ప్రభుత్వం సచివాలయాల క్రమబద్దీకరణ దిశగా కీలక అడుగులు వేస్తోంది. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల క్రమబద్దీకరణ కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పుడు సచివాలయాల ఉద్యోగుల విభజన కు మార్గదర్శకాలు సిద్దం అయ్యాయ. ఇతర సిబ్బందిని ప్రభుత్వ శాఖల్లో వినియోగించుకొనేలా నిర్ణయించారు. దీంతో, 40 వేల మంది సిబ్బంది భవిష్యత్ పైన నిర్ణయం ఏంటనేది ఉత్కంఠగా మారుతోంది. ఈ అంశం పై నేడు ప్రభుత్వం కీలక చర్చలు చేయనుంది.

కీలక చర్చలు
ఏపీ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల విషయంలో నేడు కీలక నిర్ణయం తీసుకోనుంది. ఉద్యోగుల క్రమబద్దీకరణ.. విధుల ఖరారు.. దాదాపు 40 వేల మందిని ప్రభుత్వ శాఖలకు పంపటం పైన ఈ రోజు సచివాలయ ఉద్యోగ సంఘాలతో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి చర్చించను న్నారు. వైసీపీ హయాంలో ఏర్పాటు అయిన ఈ సచివాలయాల నిర్వహణ పైన తాజాగా కీలక నిర్ణయాలు తీసుకుంది. వాలంటీర్లను కూటమి ప్రభుత్వం పక్కన పెట్టేసింది. సచివాలయ సిబ్బందితోనే పెన్షన్లు పంపిణీతో పాటుగా ఇతర విధులను కొనసాగిస్తోంది. ఇదే సమయంలో సచివాలయంలో పని చేసే కొన్ని విభాగాల ఉద్యోగుల విధుల్లో మార్పులకు సిద్దమైంది.

తాజా కసరత్తు
వైసీపీ హయాంలో ఏర్పాటైన వార్డు – గ్రామ సచివాలయాల ఉద్యోగుల విధుల పైన కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే సచివాలయాల క్రమబద్దీకరణ పైన మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ విషయంలో పూర్తిగా అధ్యయనం చేసిన తరువాతనే అమలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారు. ఇదే సమయంలో గత ప్రభుత్వ హయాంలో వారిని సచివాలయాల పరిధిలో శిశు సంక్షేమ విధుల కోసం తీసుకున్న ఉద్యోగుల విషయంలో తాజాగా ప్రభుత్వం ఫోకస్ చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో వీరికి యూనిఫాం ఇచ్చి పోలీసు డ్యూటీ చేయమన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్‌కు ఎటాచ్‌ చేసారు.

ప్రభుత్వ శాఖల్లో విలీనం
ప్రభుత్వ ఆలోచనల మేరకు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని మూడు కేటగిరీలు విభజన చేసారు. మిగులు సిబ్బందిని ప్రభుత్వ శాఖలకు బదిలీ చేయాలని భావిస్తోంది. ఈ లెక్కన దాదాపు 40 వేల మంది ఉద్యోగుల విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నిర్ణయానికి ముందే సచివాలయ ఉద్యోగ సంఘాలతో సమావేశంలో వారి సూచనలు.. అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ రోజు జరిగే చర్చల తరువాత వచ్చే మంత్రివర్గ సమావేశంలో చర్చించి.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే అధికారిక నిర్ణయం ప్రకటించేలా ప్రభుత్వం కార్యాచరణ సిద్దం చేస్తోంది. దీంతో, ఈ రోజు జరిగే చర్చలు సచివాలయ ఉద్యోగుల భవిష్యత్ కు కీలకం కానున్నాయి.

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video