తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు సేవలు అందిస్తోన్న సేవకులకు మరింత మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. శ్రీవారి సేవలకు వ్యవస్థ, వారి పనితీరుపై టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామల రావు సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ దేశంలోని వివిధ ప్రాంతాలు- ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాల నుంచి శ్రీవారి సేవ చేయడానికి సేవకులు స్వచ్ఛందంగా అధిక సంఖ్యలో తిరుమల వస్తున్నారని, వారందరికి ప్రణాళికా బద్ధంగా శిక్షణ ఇవ్వాలని అన్నారు. దీనికి అవసరమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.
మెడికల్, ఇంజినీరింగ్, ఐటీ, క్యాటరింగ్, కల్చరల్, గోసేవ తదితర రంగాల నుండి నిపుణులను శ్రీవారి సేవలో భాగస్వామ్యం చేసేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రవాసాంధ్రులు కూడా శ్రీవారి సేవ చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. దీనికి అనుగుణంగా ఐటీ అప్లికేషన్లో అవసరమైన మార్పులు చేయాలని ఈవో ఆదేశించారు. . శ్రీవారి సేవపై శిక్షణ కోసం పుట్టపర్తి, ఈశా పౌండేషన్, ఆర్ట్ ఆప్ లివింగ్ తదితర సంస్థల నుండి ఇప్పటికే అభిప్రాయాలను సేకరించామని, సదరు నిపుణుల అభిప్రాయాలను క్రోడీకరించాలని సూచించారు. శిక్షణలో మెడిటేషన్, యోగా, నైపుణ్యాభివృద్ధి, వైద్య సేవలు, సామర్థ్యాల పెంపు, అభిప్రాయ సేకరణ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఇప్పటికే శిక్షణ తీసుకున్న సీనియర్ శ్రీవారి సేవకులను మాస్టర్ ట్రైనర్స్గా తీర్చిదిద్దాలని ఈవో సూచించారు. శ్రీవారి మహాత్యం, తిరుమల ప్రాముఖ్యత, శ్రీవారి సేవ విధి, విధానాలు, సేవా నిరతి, మరింత నాణ్యమైన సేవలు, నాయకత్వ లక్షణాలు, నైతిక విలువలు తదితర అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు.
మాస్టర్ ట్రైనర్లతో శిక్షణా కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రారంభంలో ఏపీలోని 26 జిల్లాల నుండి గ్రూప్ లీడర్లను ఎంపిక చేస్తామని, తదుపరి దశల్లో తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాలకు గ్రూప్ లీడర్లను ఎంపిక ఉంటుందని చెప్పారు. ఈ శిక్షణ మాడ్యూల్లో తిరుమల ప్రాముఖ్యతను శ్రీవారి సేవకులకు వివరించడం, శ్రీవారి సేవలో పాల్గొన్నప్పుడు వాళ్లు చేయవలసినవి, చేయకూడనవి, భక్తులకు అంకితభావంతో ఎలా సేవ చేయడం, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడం, నైతిక విలువలను అలవర్చుకోవడం, ఇతర అంశాలు ఉంటాయని ఈఓ తెలిపారు.

Leave feedback about this