ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరుకానున్నారు. సోమవారం ప్రయాగ్రాజ్కు రాష్ట్రపతి వెళ్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానమాచరించడంతోపాటు స్థానిక ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో కుంభమేళాలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి రాష్ట్రపతి భవన్ వర్గాలు ప్రకటన వెలువరించాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఫిబ్రవరి 10న ఉదయం ప్రయాగ్ రాజ్కు చేరుకుంటారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించి ప్రార్థనలు చేస్తారు. అనంతరం బడే హనుమాన్ ఆలయం, పవిత్రమైన అక్షయవత్ వృక్షాన్ని సందర్శించారు. కుంభమేళా ప్రదేశంలో ఏర్పాటు చేసిన డిజిటల్ కుంభ్ అనుభవ్ సెంటర్ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పరిశీలిస్తారని వెల్లడించాయి.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సమయంలో ఆమె వెంట ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉంటారని యూపీ సీఎంవో వెల్లడించింది. గతంలో తొలి భారత రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ కూడా కుంభమేళాకు హాజరయ్యారు. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇప్పుడు మహా కుంభమేళాను సందర్శిస్తుండటం గమనార్హం.
కాగా, ప్రయాగ్ రాజ్లో మహా కుంభమేళా ప్రారంభమై 28 రోజులు గడస్తున్నా.. కోట్లాది మంది భక్తులు వచ్చిన పుణ్యస్నానాలు ఆచరిస్తూనే ఉన్నారు. రద్దీ మాత్రం తగ్గడం లేదు. ఆదివారం సెలవు దినం కావడంతో భారీ సంఖ్యలో భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. పెద్ద సంఖ్యలో వాహనాలు రావడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ గంటలపాటు నిలిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆదివారం సాయంత్రం వరకు ఒక కోటి 41 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు అంచనా వేశారు. కాగా, ఇప్పటి వరకు మహా కుంభమేళాకు వచ్చినవారి సంఖ్య 42 కోట్లకు చేరుకున్నట్లు యూపీ సర్కారు వెల్లడించింది.

Leave feedback about this