IRCTC Pancha Jyothirlinga Yatra with Shirdi package: భక్తుల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ మరో ప్యాకేజీని ప్రకటించింది. ఏపీలో శ్రీశైలం కలుపుకొని మహారాష్ట్రలోని పంచ జ్యోతిర్లింగాలు, షిర్డీ సాయినాథుడిని దర్శించుకోవడానికి ఉద్దేశించిన ప్యాకేజీ టూర్ ఇది.
భారత్ గౌరవ్ ఎక్స్ప్రెస్ ద్వారా భక్తులు ఆయా పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. ఎనిమిది రాత్రులు/తొమ్మిది పగళ్లు సాగే యాత్ర ఇది. ఏప్రిల్ 24వ తేదీన తమిళనాడులోని తిరునెల్వేలి నుంచి భారత్ గౌరవ్ ఎక్స్ప్రెస్ బయలుదేరి వెళ్తుంది. మొత్తం 700 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఇందులో ఎకానమీ- 510, కంఫర్ట్- 190 సీట్లు.
తిరునెల్వేలి నుంచి బయలుదేరే ఈ ఎక్స్ప్రెస్కు తెన్కాశి, రాజపాళ్యం, శివకాశి, విరుధునగర్, మధురై, దిండిగల్, తిరుచ్చి, కరూర్, ఈరోడ్, సేలం, జోలార్పేట, అరక్కోణం, కాట్పాడి, పెరంబూర్, ఏపీలో రేణిగుంట, కడప, గుత్తి, కర్నూలు, మహారాష్ట్రలో నాందెడ్, పర్లీ, ఔరంగాబాద్, షిర్డీ, పుణేల్లో హాల్ట్ సౌకర్యం ఉంది. ఆయా స్టేషన్లల్లో ప్రయాణికులు బోర్డింగ్/డీబోర్డింగ్ అవ్వొచ్చు. ఈ ప్యాకేజీలో శ్రీశైలం భ్రమరాంబ, మల్లికార్జున స్వామివారి ఆలయాన్ని చేర్చారు ఐఆర్సీటీసీ అధికారులు. నాందెడ్- ఔందా నాగనాథ్ ఆలయం, పర్లీ- వైద్యనాథ్ దేవస్థానం, ఔరంగాబాద్- ఘృణ్నేశ్వర్ మందిరం, షిర్డీ- సాయిబాబా ఆలయం, పుణే- భీమశంకర్ దేవస్థానాలను దర్శించుకునే వీలుంది. పుణే భీమశంకర్ ఆలయ దర్శనంతో ఈ టూర్ ముగుస్తుంది. భారత్ గౌరవ్ రైలు తిరునెల్వేలికి తిరుగు ప్రయాణమౌతుంది.
ఈ ప్యాకేజీ కోసం ఒక్కొక్కరు చెల్లించాల్సిన ఛార్జీ మొత్తం 16,660 రూపాయలు. ఇది ఎకానమీ అంటే స్లీపర్ క్లాస్. కంఫర్ట్ కేటగిరీలో 30,700 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో పిల్లలకు ఎలాంటి మినహాయింపు లేదు. పిల్లలకూ ఇదే ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.

Leave feedback about this