తాజాగా ఏపీ శాసనమండలిలో ఖాళీ అవుతున్న మూడు సీట్లకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇందులో రెండు గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ సీట్లతో పాటు మరో టీచర్స్ ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్సీ సీటు ఉన్నాయి. కృష్ణా-గుంటూరు జిల్లాల, ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికలు జరిగాయి. అలాగే ఉత్తరాంధ్రలో టీచర్స్ ఎమ్మెల్సీ కోటా ఎన్నికలు జరిగాయి. వీటిలో టీడీపీతో పీడీఎఫ్, యూటీఎఫ్ పోటీపడ్డాయి. వైసీపీ పోటీకి దూరంగా ఉంది.
ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ సీటుకు జరిగిన ఓట్ల లెక్కింపు విశాఖలోని ఆంధ్రా యూనివర్శిటీలో జరుగుతోంది. అలాగే ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపు ఏలూరు సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో జరుగుతోంది. కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లను గుంటూరు ఏసీ కాలేజీలో లెక్కిస్తున్నారు. కృష్ణా-గుంటూరు ఎమ్మెల్సీ సీటుకు 25 మంది, గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ సీటుకు ఏకంగా 35 మంది పోటీ పడ్డారు. ఈ రెండు సీట్లలో ప్రధాన పోటీ టీడీపీ, పీడీఎఫ్ అభ్యర్ధుల మధ్యే ఉంది.
ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ సీటుకు మాత్రం బహుముఖ పోటీ జరిగింది. ఇందులో టీడీపీ అభ్యర్ధికి పోటీగా యూటీఎఫ్, పీడీఎఫ్ అభ్యర్ధులు పోటీ పడ్డారు. దీంతో ఈ సీటులో ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ ఫలితాలన్నీ ఇవాళ అర్ధరాత్రి వరకూ తేలే అవకాశం ఉంది. అలాగే అధికార టీడీపీకి, కూటమికీ ఇవి కీలకంగా మారాయి. అధికారంలోకి వచ్చాక తొలిసారి కూటమి ఇంత గట్టి పోటీ ఎదుర్కొంటోంది. వైసీపీ అభ్యర్ధుల్ని పోటీకి పెట్టకుండా దూరంగా ఉండిపోయింది. అయినా పీడీఎఫ్ అభ్యర్ధులకు తెరవెనుక మద్దతు ఇచ్చింది. దీంతో పోరు ఆసక్తికరంగా మారింది.

Leave feedback about this