ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సూపర్ సిక్స్ పథకాల అమలు పైన మంత్రివర్గ భేటీలో చర్చించారు. నాలుగు నెలల కాలంలో మూడు హామీల అమలుకు నిర్ణయించారు. అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ అమలు చేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేస్తున్నారు. కాగా, తాజాగా తల్లికి వందనం తో పాటుగా అన్నదాత సుఖీభవ పథకాలను వచ్చే ఆర్దిక సంవత్సరంలో అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంత్రులకు విధి విధానాల ఖరారు బాధ్యతలను అప్పగించారు.
జూన్ లో తల్లికి వందనం తాజాగా జరిగిన ఏపీ మంత్రివర్గ భేటీలో సంక్షేమ పథకాల అమలు పైన చర్చ జరిగింది. అందులో భాగంగా సంక్షేమ పథకాలు హామీ ఇచ్చిన విధంగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేసారు. అమలు కార్యాచరణ ఖరారు చేసారు. ఏప్రిల్ నుంచి ప్రారంభం కానున్న కొత్త ఆర్దిక సంవత్సరంలో ఒక్కొక్కటిగా అమలుకు నిర్ణయించారు. జూన్ నుంచి ప్రారంభం కానున్న విద్యా సంవత్సరం వేళ తల్లికి వందనం ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. విద్యా సంవత్సరం ప్రారంభం వేళ ఈ పథకం అమలుకు నిర్ణయం తీసుకున్నారు. ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి ఈ పథకం కింద తల్లుల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ 15 వేలు చొప్పున జమ చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు జూన్ లో ఈ పథకం అమలు చేయాలని నిర్ణయించారు.
మే లో అన్నదాత సుఖీభవ అదే విధంగా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రతీ రైతుకు ఏటా రూ 20 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ నిధుల కోసం రైతులు నిరీక్షిస్తున్నారు. కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం కింద ఇస్తున్న రూ 6 వేలకు రాష్ట్ర ప్రభుత్వం రూ 14వేలు కలిపి రూ 20 వేలు రైతుల ఖాతాల్లో జమ చేయాలని తొలుత నిర్ణయించారు. నిధుల లభ్యత చూసుకొని మూడు విడతల్లో అమలు చేసే ఆలోచన పైనా చర్చ జరిగింది. అయితే, వచ్చే ఆర్దిక సంవత్సరంలోనే ఈ పథకం కూడా అమలు చేయాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారు. మే నెలలో రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ పథకం కింద నిధులు జమ కానున్నాయి. ఏప్రిల్ – మే నెలల్లో మత్య్సకార నిధులను విడుదల చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు.
కీలక నిర్ణయాలు రెవెన్యూ సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేయడానికి ఏం చేయాలన్న దానిపై కేబినెట్లో చర్చ తరువాత కీలక నిర్ణయం తీసుకున్నారు గతంలో ఆర్డీవో స్థాయిలోనే అప్పీల్ చేసుకునే అధికారం ఉండేదని అధికారులు వివరించారు. వైసీపీ ప్రభుత్వంలో ఆర్డీవోను పక్కన పెట్టి డీఆర్వో కు ఆ బాధ్యతలు అప్పగించారని వెల్లడించారు. దీని కారణంగా డీఆర్వోలపై పనిఒత్తిడితో రెవెన్యూ ఫైళ్లు భారీగా పేరుకుపోతున్నాయని అభిప్రాయం వ్యక్తం అయింది. దీంతో, గతంలో మాదిరి ఆర్డీవో కే అప్పీల్ చేసుకునే అధికారాన్ని కట్టబెట్టాలని నిర్ణయించారు. టీడీపీ హయాంలో 2014-19 మధ్య నీరు-చెట్టు పనులు చేసిన టీడీపీ సానుభూతిపరుల బిల్లులు చెల్లింపుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. 2019 నాటికి ఉన్న ఇళ్ల బకాయిలు కూడా క్లియర్ చేయాలని నిర్ణయించారు.

Leave feedback about this