Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. మంగళవారం నాడు 68,427 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 21,066 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.81 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
శ్రీ అనంతాళ్వారును సాక్షాత్తు ఆదిశేషుని రూపంగా ఆరాధిస్తారు. రామానుజాచార్యుని కోరిక మేరకు తిరుమలకు వేంచేసి స్వామివారి పుష్ప కైంకర్యానికి శ్రీకారం చుట్టినట్లు పురాణాల్లో ఉంది. పుష్ప కైంకర్యాల కోసం అనంతాళ్వారు స్వామివారి ఆలయం వద్ద తోటను ఏర్పాటు చేశారని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
తోటను ఏర్పాటు చేస్తోన్న సమయంలో బాలుడి రూపంలో శ్రీవేంకటేశ్వరస్వామివారు ప్రత్యక్షం అయ్యాడని, అనంతాళ్వారు ఆ బాలుడిపై గునపాన్ని విసరగా.. స్వామివారి మూలవిరాట్టు చుబుకం నుండి రక్తస్రావం రావడం చూసి తాను చేసిన పొరపాటుకు పశ్చాత్తాపంతో ఆ గాయానికి కర్పూరాన్ని అంటించాడని విశ్వసిస్తారు. నేటికీ శ్రీవారి మూలవిరాట్టు చుబుకానికి కర్పూరాన్ని అంటించడం ఆనవాయితీగా వస్తోంది. నేటికీ శ్రీవారి ఆలయ మహాద్వారం వద్ద ఆ గునపం భక్తులకు దర్శనం ఇస్తోంది.

Leave feedback about this