Tirumala: తిరుమలలో అన్నప్రసాదం మెనూలో మార్పులు చేయాలని టీటీడీ నిర్ణయించింది. కొత్త బోర్డు కొలువు తీరిన తరువాత అన్న ప్రసాద మెనూలో కొత్త పదార్ధాలను చేర్చాలని ఛైర్మన్ నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే ప్రయోగాత్మకంగా అమలు చేసారు. భక్తుల నుంచి సానుకూల స్పందన రావటంతో కొన సాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో బ్రేక్ దర్శనాల విషయంలోనూ టీటీడీలో చర్చ మొదలైంది. పెరుగుతున్న బ్రేక్ దర్శనాలను కుదించే అంశం పరిశీలన చేస్తున్నారు.
అన్నప్రసాదంలో కొత్తగా కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్న్యూస్ చెప్పింది. తిరుమలలోని వేంగమాంబ అన్న ప్రసాద వితరణ కేంద్రంలో అన్నప్రసాదంలో కొత్తగా మసాలా వడలు పెట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే ట్రయల్ రన్లో భాగంగా దాదాపు 5వేల మంది భక్తులకు ఉల్లిపాయలు వాడకుండా చేసిన మసాలా వడలను వడ్డించారు. ఇక, ఈ నెల 6వ తేదీ నుంచి పూర్తి స్థాయి అమల్లోకి తెచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటుగా తిరుమలలో మంచి నీటి కోసం వినియోగిస్తున్న గాజు సీసాల స్థానంలో కొత్తగా టెట్రా ప్యాకెట్ లు అందుబాటు లోకి తీసుకురావాలని టీటీడీ నిర్ణయించింది. త్వరలోనే ఈ విధానం అమల్లోకి రానుంది.
బ్రేక్ దర్శనాల కోసం తిరుమలలో శ్రీవారి బ్రేక్ దర్శనాల కోసం టీటీడీ పైన ఒత్తిడి పెరుగుతోంది. తాజాగా తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపై కూడా వీఐపీ బ్రేక్, రూ.300 దర్శన టికెట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకారం తెలపడంతో మరింతగా లేఖల సంఖ్య పెరుగుతోంది. ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపినా.. తమ లేఖలు తీసుకోవటం లేదని తెలంగాణ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీ నుంచి ఏపీ ప్రజాప్రతినిధుల ద్వారానే 1,800 నుంచి 2 వేల వరకు బ్రేక్ దర్శనాలకు టికెట్లు ఇస్తున్నట్లు సమాచారం. ఇక.. పలువురు ప్రముఖులు.. ప్రభుత్వంలోని కీలక విభాగాల నుంచి వచ్చే వీఐపీలతో పాటుగా దాతలు.. శ్రీవాణి ట్రస్టుకు ఇచ్చే భక్తులకు మరో 1500 బ్రేక్ టికెట్లు ఇవ్వాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు.

Leave feedback about this