Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం నాడు 75,706 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 23,340 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.34 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఆరు కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.
నేడు రథ సప్తమికి తిరుమలలో ముస్తాబైంది. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. సూర్యజయంతి నాడు శ్రీవారిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు రావడం ఆనవాయితీగా వస్తోంది. ఈ దఫా రెండు నుంచి మూడు లక్షల మంది వరకు భక్తులు తిరుమలకు వస్తారని అధికారులు అంచనా వేస్తోన్నారు.
ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు అన్ని విభాగాలకు చెందిన ఉద్యోగులతో సమావేశం అయ్యారు. పలు సూచనలు చేశారు. చక్రస్నానం రోజున ఉద్యోగులు తమకు అప్పగించిన ప్రాంతాల్లో విధులను నిర్వర్తించాలని కోరారు. నాలుగు మాడ వీధుల్లో దాదాపు 200 గ్యాలరీలు, 66 అన్నదాన కౌంటర్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
అదే సమయంలో ఆయన అలిపిరి నడక మార్గంలోని మోకాలి మిట్ట వద్ద ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు. నడక మార్గంలోని మరుగుదొడ్లను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలంటూ అక్కడున్న సిబ్బందిని ఆదేశించారు.
అనంతరం తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ఈవో తనిఖీలు నిర్వహించారు. అక్కడ భక్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా అన్న ప్రసాదంపై భక్తుల నుండి సలహాలు, సూచనలు స్వీకరించారు. అన్నప్రసాదం నాణ్యత పట్ల భక్తులు సంతృప్తిని వ్యక్తం చేశారని టీటీడీ తెలిపింది.

Leave feedback about this