షిర్డీ సాయి సంస్థాన్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రసాదాలయ నిర్వహణలో కీలక మార్పులు అమల్లోకి తెచ్చింది. సాయి దర్శనం తర్వాత ఉచిత భోజన టోకెన్లను అందించడానికి ఏర్పాట్లు చేసింది. టోకెన్ల ద్వారానే ప్రసాదం సదుపాయం అమలు చేస్తోంది. తాజాగా చోటు చేసుకున్న కొన్ని ఘటనలతో ఈ మార్పులు చేస్తున్నట్లు ట్రస్టు ప్రకటించింది. ఇక నుంచి టోకెన్ లేని వారిని ప్రసాదాలయంలోకి అనుమతించమని సంస్థాన్ సీఈవో వెల్లడించారు.
దీంతో, అటు వంటి వారికి ప్రవేశం లేకుండా టోకెన్ విధానం అమలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సాయిబాబా దర్శనం అనంతరం బయటకు వచ్చే భక్తులకు సాయి ప్రసాదాలయంలో ఉచిత భోజన టోకెన్తో పాటు విభూది, బూందీ ప్రసాదాన్ని అందిస్తున్నారు. ఒకవేళ దర్శనానికి ముందే భోజనం చేయాలనుకునే భక్తులకు ప్రసాదాలయంలో ఉచితంగా టోకెన్లు అందించేలా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. సాయి సంస్థాన్ ఆధ్వర్యంలో నడిచే రెండు ఆస్పత్రుల రోగులు, వారి కుటుంబీకులకు వసతి ఏర్పాట్లు చేస్తామని వివరించారు. కొద్ది రోజుల క్రితం షిర్డీ సాయి సంస్థాన్ కు చెందిన ఇద్దరు ఉద్యోగులు హత్యకు గురయ్యారు. ఈ ఘటనతో సంస్థాన్ అధికారులు అప్రమత్తం అయ్యారు. అందులో భాగంగా ప్రసాదాలయంలోకి వచ్చే వారి విషయంలో నియంత్రణ దిశగా చర్యలు చేపట్టారు. టోకెన్ విధానం తప్పని సరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పెద్ద సంఖ్యలో ప్రసాదాలయంకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండానే సమస్య పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేసారు. వెంటనే ఈ విధానం అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు.
