సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అతడు సినిమాకు ఎన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ అభిమానులు పెరుగుతున్నారేకానీ తరగడంలేదు. తరం మారుతున్నప్పటికీ కొత్తతరంలోని సినీ ప్రియులు కూడా ఈ సినిమాను బాగా ఇష్టపడుతున్నారు. స్టార్ మా టీవీలో ఈ సినిమాను 1500సార్లకు పైగా ప్రసారం చేశారు. ప్రసారం చేసిన ప్రతిసారీ మంచి టీఆర్పీ రేటింగ్ దక్కించుకుంటోంది. థియేటర్లలో విడుదలైన మొదటి వారం, పదిరోజులు ఈ సినిమా మీద పెద్దగా అంచనాలు లేవు. తర్వాత నుంచి అందరికీ నచ్చింది. ఆరోజుల్లోనే దాదాపు రూ.25 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. మహేష్ బాబు కెరీర్ లోనే ఈ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంటుంది.అటువంటి గొప్ప సినిమాను మళ్లీ రీరిలీజ్ చేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో జయభేరి పతాకంపై మురళీమోహన్ నిర్మించారు. ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీన మహేష్ బాబు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అతడును ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు ప్రీరిలీజ్ థియేట్రికల్ వ్యాపారం రూ.3.50 కోట్లు జరిగి ఫిలింనగర్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. థియేటర్లలో ఎక్కువ రోజులు ఆడటంద్వారా అతడు సినిమా రూ.25 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.10 కోట్ల గ్రాస్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. సినిమా విడుదలకు ఇంకా మూడు నెలల సమయం ఉన్నప్పటికీ ఇప్పటికే థియేట్రికల్ వ్యాపారం జరుగుతుండటం గమనార్హం.
‘అతడు’ రీరిలీజ్… మైండ్ బ్లోయింగ్ బిజినెస్
