ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు వివిధ రాష్ట్రాల నుంచి కోట్ల సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. పుణ్యస్నానాలు చేసేందుకు పోటీ పడుతున్నారు. అమృత స్నానాలకు అయితే రద్దీ మరీ ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తొక్కిసలాట కూడా చోటు చేసుకుంది. ఇందులో 50 మంది వరకూ చనిపోయారు. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల నుంచి కుంభమేళా కోసం వచ్చే రైళ్లలోనూ రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది.
ఇదే క్రమంలో ఏపీలోని విజయవాడ, కాకినాడ నుంచి కుంభమేళా కోసం ప్రత్యేకంగా నడుపుతున్న రైళ్లలోనూ రద్దీ అంతకంతకూ పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ఇవాళ రెండు ప్రత్యేక రైళ్లలో బోగీల సంఖ్యను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే నడుపుతున్న ఈ రెండు రైళ్లలో బోగీల సంఖ్యను తాత్కాలికంగా పెంచుతూ దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.
దీని ప్రకారం విజయవాడ నుంచి గయ వెళ్లే ప్రత్యేక రైలులో థర్డ్ ఏసీ 2 కోచ్ లు, స్లీపర్ మరో రెండు కోచ్ లు పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ నుంచి ఈ నెల 5న బయలుదేరే రైలుతో పాటు గయ నుంచి విజయవాడకు ఈ నెల 8న బయలుదేరే మరో ప్రత్యేక రైలులోనూ ఇలా కోచ్ లు పెంచుతున్నారు. అలాగే కాకినాడ టౌన్ నుంచి గయకు ఈ నెల 8న బయలుదేరే ప్రత్యేక రైలులోనూ ధర్డ్ ఏసీ మరో రెండు కోచ్ లు కలుపుతున్నారు. అలాగే గయ నుంచి ఈ నెల 10న తిరిగి బయలుదేరే రైలులోనూ ఇలా ధర్డ్ ఏసీ రెండు కోచ్ లు కలుస్తాయి.
