apollonews.in Blog తాజా వార్తలు గుంటూరు సిటీకి అదిరిపోయే న్యూస్ చెప్పిన కేంద్రం..!
తాజా వార్తలు

గుంటూరు సిటీకి అదిరిపోయే న్యూస్ చెప్పిన కేంద్రం..!

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ కేంద్రం నుంచి వరుసగా శుభవార్తలు అందుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఏపీలోని నగరాల్లో దశాబ్దాలుగా పేరుకుపోయిన పలు సమస్యలకు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం పరిష్కారాలు చూపిస్తోంది. రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు, ఎంపీలు చూపిస్తున్న చొరవకు కేంద్రం సాయం కూడా తోడవడంతో గుంటూరుకు మరో గుడ్ న్యూస్ అందింది.

అమరావతి రాజధానిలో కీలకమైన గుంటూరు నగరంలో ట్రాఫిక్ సమస్యలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రోడ్ల విస్తరణ చేసే పరిస్ధితి లేదు. దీనికి తోడు నగరంలో ఉన్న రైల్వే మార్గాలు కూడా సమస్యల్ని మరింత పెంచేస్తున్నాయి. ఇలాంటి సమయంలో పాత డిమాండ్ అయిన రైల్వే మూడో ఫ్లైఓవర్ కు కేంద్రం మోక్షం కల్పించింది. ఈ మేరకు స్దానిక ఎంపీ, కేంద్ర మంత్రి కూడా అయిన పెమ్మసాని చంద్రశేఖర్ కీలక ప్రకటన చేశారు.ఇప్పటికే గుంటూరు నగరంలో కేటాయించిన శంకర్ విలాస్, ఇన్నర్ రింగ్ రోడ్డు ఫ్లైఓవర్లకు అదనంగా గుంటూరు-నల్లపాడు మధ్య మరో రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణానికి రైల్వే శాఖ అంగీకరించినట్లు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. దీని వల్ల పెదపలకలూరు, పుల్లడి గుంట్ల, పేరేచర్లను కలిపేందుకు వీలు కలుగుతుందన్నారు.

రూ.41 కోట్ల మేర ఖర్చయ్యే ఈ ఫ్లైవర్ నిర్మాణానికి కేంద్రం ఆమోదముద్ర వేసినట్లు పెమ్మసాని వెల్లడించారు. మూడు వారాల్లో టెండర్ల ప్రక్రియ ప్రారంభించి మూడేళ్లలో వీటిని పూర్తి చేస్తామన్నారు. ఈ మూడు ఫ్లైఓవర్లకూ కేంద్రమే పూర్తిగా నిధులు ఇవ్వబోతోందని తెలిపారు.

Exit mobile version