ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా కొత్త రేషన్ కార్డుల చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత అప్పటికే ఉన్న రేషన్ కార్డుల్ని రద్దు చేసి తమ ప్రభుత్వ ముద్రతో కొత్త రేషన్ కార్డుల్ని జారీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనూ కొత్త రేషన్ కార్డుల జారీ కోసం లబ్దిదారులు ఎదురుచూస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇది పూర్తి కాగానే రేషన్ కార్డులు జారీ ప్రారంభం కానుంది.
అయితే కొత్త రేషన్ కార్డులకు కీలకమైన ఈకేవైసీ ప్రక్రియపై లబ్దిదారుల్లో చాలా చోట్ల అవగాహన లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఈకేవైసీ చేయించుకునే గడువును గత నెలలో ముగిసినా ఈ నెలాఖరు వరకూ పెంచారు. ఇలా ఈకేవైసీ చేయించుకునే వారి కోసం ప్రభుత్వం ఆన్ లైన్లో తమకు ఈకేవైసీ అయ్యిందో లేదో చెక్ చేసుకునే ఆప్షన్ ను ఇచ్చింది. పౌరసరఫరాల శాఖ వెబ్ సైట్ లో ఈ మేరకు ఈకేవైసీ చెక్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు. అలాగే దీన్ని ఎలా చెక్ చేసుకోవాలో కూడా అధికారులు లబ్దిదారులకు వివరిస్తున్నారు.
ఇలా ఈకేవైసీ ఆన్ లైన్ లో చెక్ చేసుకోవాలనుకునే వారు ముందుగా గూగుల్ క్రోమ్ లేదా మరేదైనా బ్రౌజర్ లోకి వెళ్లి ఈపీడీఎస్ 1 అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే గూగుల్ సెర్చ్ లో ఈపీడీఎస్ 1 వెబ్ సైట్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే పౌరసరఫరాలశాఖ వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది. అందులో పైన డాష్ బోర్డు ఆప్షన్ లోకి వెళ్లాలి. అక్కడ రేషన్ కార్డు అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులో ఆరు రకాల ఆప్షన్లు ఉన్నాయి. వీటిలో ఈపీడీఎస్ అప్లికేషన్ సెర్చ్ లేదా రైస్ కార్డు సెర్చ్ ఆప్షన్ లోకి వెళ్లాలి.
అక్కడ రేషన్ కార్డు లేదా రైస్ కార్డు ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ మీ రేషన్ కార్డు లేదా రైస్ కార్డు నంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే ఈకైవైసీ అయ్యిందో లేదో కనిపిస్తుంది. అయితే సరి. కాకపోతే మాత్రం ఈ నెలాఖరులోపు ఈకేవైసీ చేయించుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఇప్పటికే నెల రోజుల గడువు పొడిగించారు కాబట్టి మరోసారి గడువు పొడిగింపు ఉండకపోవచ్చు. ఈ ప్రక్రియ పూర్తి చేసి కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం సిద్దమవుతోంది.
