Tirumala: కలియుగ వైకుంఠంలా అలరారుతున్న తిరుమలలో రథ సప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా ముగిశాయి. సూర్యజయంతి సందర్భంగా సప్తవాహనాలపై ఊరేగారు శ్రీవారు. భక్తులను కరుణించారు. సప్తాశ్వరూఢుడైన శ్రీవారిని లక్షలాదిమంది భక్తులు దర్శించుకున్నారు. తమ మొక్కులను చెల్లించుకున్నారు.
మంగళవారం తెల్లవారు జామున సూర్యప్రభ వాహనంతో ఈ ఉత్సవాలు మొదలయ్యాయి. ఈ తెల్లవారు జామున తిరుమల ఆనంద నిలయం వాయువ్య దిశలో ఉన్న మేదరమిట్ట మూలలో తొలుత సూర్యప్రభ వాహనాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చారు. సరిగ్గా 6:38 నిమిషాలకు సూర్య కిరణాలు వాహనాన్ని తాకాయి. దీనితో ఒక్కసారిగా గోవిందుడి నామస్మరణతో తిరుమలగిరులు మార్మోగిపోయాయి.
ఆ వెంటనే అర్చకులు మలయప్ప స్వామివారికి ప్రత్యేకంగా హారతి ఇచ్చారు. నివేదనను సమర్పించారు. తిరిగి వాహనసేవ ప్రారంభమైంది. ఉదయం 9 గంటలకు చిన్నశేషవాహన సేవ, 11 గంటలకు గరుడవాహనంపై శ్రీవారు దర్శనం ఇచ్చారు. మధ్యాహ్నం ఒంటి గంట నుండి 2 వరకు- హనుమంత వాహనం, 2 నుండి 3 గంటల వరకు- చక్రస్నానం నిర్వహించారు అర్చకులు. సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు- కల్పవృక్ష వాహనం, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనం, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు- చంద్రప్రభ వాహనంపై స్వామివారు ఊరేగారు. ఒకే రోజున ఏడు వాహనాలపై మలయప్ప స్వామివారు ఊరేగే పర్వదినం కావడం వల్ల రథ సప్తమి వేడుకలను మినీ బ్రహ్మోత్సవంగా భావిస్తుంటారు భక్తులు.
