Tirumala: తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం అందుతోంది. వేసవి సెలవులు.. వారాంతంలో భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తున్నారు. దీంతో, టీటీడీ దర్శన వేళల్లో మార్పులు చేసింది. బ్రేక్ దర్శన సమయాలను నేటి నుంచి ప్రయోగాత్మకంగా మార్పు చేసి అమలు చేస్తున్నారు. అదే సమయంలో ఏ కోటా దర్శనం ఎప్పుడో టీటీడీ స్పష్టత ఇచ్చింది. సామాన్య భక్తులకు మరో గంట దర్శన సమయం పెరిగింది.తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాల మార్పు ఈ రోజు (గురువారం) నుంచి అమల్లోకి రానుంది. గతంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉదయం 5.30 గంటలకు మొదలై ఉదయం 11 గంటలకు ముగిసేవి. అయితే రాత్రి వేళల్లో కంపార్టుమెంట్లలో వేచి ఉండే భక్తులకు త్వరితగతిన దర్శనం చేయించాలనే ఉద్దేశంతో గతంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను ఉదయం 10 గంటలకు మార్చారు. అయినప్పటికీ జనరల్ బ్రేక్ దర్శన భక్తులకు మాత్రం ఉదయం 8 గంటల నుంచి 10 గంటలోపు దర్శనం చేయిస్తున్నారు. ఇక, రెండవ నైవేద్యం గంట అంటే ఉదయం 10 గంటల తర్వాత ప్రొటోకాల్, రెఫరల్, శ్రీవాణి, ఉద్యోగులకు దర్శనం చేయిస్తున్నారు. దాదాపు మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ బ్రేక్ దర్శనాలు నడుస్తున్నాయి.క్యూ లైన్లలో ఉన్న భక్తులకు మేలు చేసే విధంగా ధర్మకర్తల మండలి తిరిగి బ్రేక్ దర్శనాల్లో పూర్వపు విధానాన్ని అమలుచేయాలని తీర్మానించింది. ఇందులో భాగంగా ఈ రోజు నుంచి తిరిగి పాత పద్ధతిలో బ్రేక్ దర్శనాలను ప్రవేశపెట్టేందుకు టీటీడీ సిద్ధమైంది. ప్రొటోకాల్, రిఫరెల్, జనరల్ బ్రేక్ దర్శనాలను ఉదయం 7.30 గంటల లోపు పూర్తి చేసి తర్వాత వీలైనంత మంది సామాన్య భక్తులకు దర్శనం కల్పించి తిరిగి 10.15 గంటల నుంచి 11.30 గంటలలోపు శ్రీవాణి, టీటీడీ ప్రస్తుత, రిటైర్డ్ ఉద్యోగులకు దర్శనం కల్పించేలా అధికారులు ప్రణాళికలు అమలు చేస్తు న్నారు. ఇక సిఫారసు లేఖలపై బ్రేక్ దర్శనాలనూ నేటి నుంచి రద్దు చేసిన క్రమంలో ఉదయం గంట, మధ్యాహ్నం గంటన్నర అదనంగా సామాన్య భక్తులకు దర్శన సమయం లభించనుంది.
TTD: మారిన దర్శనాల వేళలు, ఏ కోటా ఎప్పుడంటే – భక్తులకు కీలక సూచనలు..!!
