Maha Shivratri 2025: ఈ నెల 26వ తేదీన మహా శివరాత్రి. ఈ పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని శైవక్షేత్రాలు భక్తులతో పోటెత్తుతుంటాయి. శ్రీశైలం, శ్రీకాళహస్తి, మహానంది, క్షీరారామం, సోమారామం, అమరేశ్వర స్వామి, అమరలింగేశ్వర స్వామి, కోటప్ప కొండ, యాగంటి, శ్రీముఖం..వంటి ఆలయాలు భక్తుల సందడితో కోలాహలంగా మారుతుంటాయి.
మల్లికార్జునుడి దర్శనానికి విచ్చేసే అశేష భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిపై మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, బీసీ జనార్దనరెడ్డి సమీక్ష నిర్వహించారు. అధికారులకు పలు ఆదేశాలను జారీ చేశారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా, వారి అవసరాలకు తగ్గట్లు సంతృప్తికర ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను సూచించారు.
వాహనాల పార్కింగ్ ప్రదేశాలను ముందుగానే గుర్తించాలని మంత్రులు సూచించారు. హోల్డింగ్ పాయింట్ల నుంచి ఆలయం వరకు భక్తులను తరలించడానికి మొదటి సారిగా ప్రత్యేక మినీ వాహనాలు ఏర్పాటు చేస్తోన్నామని అన్నారు. భక్తుల సౌకర్యం కోసం క్యూలైన్లలో ఉచితంగా 200 ఎంఎల్ వాటర్ బాటిల్, పాలు, బిస్కెట్లు అల్పాహారం పంపిణీ చేయాలని ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశించారు. బ్రహ్మోత్సవాల పర్వదినాలలో భాగంగా ఈ నెల 24, 25, 26, 27 తేదీలలో ఉచితంగా స్వామివారి లడ్డూ ప్రసాదాలను ప్రతి ఒక్క భక్తుడికీ అందించేలా చర్యలు తీసుకోవాలని దేవస్థానం అధికారులకు సూచించారు. ఈ సంవత్సరం భక్తుల సంఖ్య 30 శాతం పెరుగుతుందని, ట్రాఫిక్ సమస్యలను నివారించేందుకు ఆరు డ్రోన్ కెమెరాలను, పర్యవేక్షించడానికి అవసరమైన వాహనాలను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు.
రెవెన్యూ, పోలీసు, దేవదాయ శాఖలు సమన్వయంతో పని చేయాలని, ప్రముఖుల దర్శనాలకు టై స్లాట్ ముందుగానే నిర్ధారించాలని ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ శివరాత్రి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రుల బృందాన్ని నియమించిందని, ఎలాంటి లోటూ జరగకూడదని అన్నారు.
