తిరుమల శ్రీవారి దర్శనం విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) భక్తులకు పలు కీలక సూచనలు చేసింది. టోకెన్లు, టికెట్లు పొందిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లలోకి ప్రవేశించాలని టీటీడీ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. ఇదే విషయాన్ని పలుమార్లు ప్రచార, ప్రసార మాధ్యమాల ద్వారా భక్తులకు తెలియజేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.ఇటీవల కొందరు భక్తులు వారికి కేటాయించిన సమయం కంటే ముందే వచ్చి క్యూలైన్లలోకి అనుమతించాలని టీటీడీ సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారని పేర్కొంది. అంతేగాక, సోషల్ మీడియాలోనూ అసత్య ప్రచారం చేస్తున్నారని.. ఇది సరైన పద్ధతి కాదని టీటీడీ తమ ప్రకటనలో వెల్లడించింది.
తిరుమలలో వైభవంగా మాఘ పౌర్ణమి గరుడ సేవ తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం సాయంత్రం మాఘ మాస పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 నుంచి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్స్వామి, అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు. వైభవంగా ముగిసిన శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు.తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ పుష్కరిణిలో ఏడు రోజుల పాటు జరిగిన స్వామివారి తెప్పోత్సవాలు బుధవారంతో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు.
అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు తెప్పలపై ఏడు చుట్లు తిరిగి భక్తులను కటాక్షించారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యర్స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ మునిక్రిష్ణారెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధనంజయ, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
