Linking Aadhaar with Voter ID: ఓటర్ కార్డులను ఆధార్తో అనుసంధానం చేసేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) సిద్ధమైంది. దీని కోసం యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) నిపుణులతో త్వరలోనే సాంకేతిక చర్చలు మొదలుపెట్టనుంది. ఓటర్ల గుర్తింపు ప్రక్రియను మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకోనున్నారు. అయితే, ఇది చట్టాల ప్రకారం, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగానే జరుగుతుందని ఈసీ స్పష్టం చేసింది.
ఆధార్ను ఓటర్ కార్డుతో లింక్ చేయడం అనేది పూర్తిగా స్వచ్ఛందమని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. ఎవరినీ బలవంతం చేయబోమని హామీ ఇచ్చింది. ఒకవేళ ఎవరైనా ఆధార్ లింక్ చేసుకోవడానికి ఇష్టపడకపోతే, వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించమని స్పష్టం చేసింది.
* ముఖ్యమైన అధికారులతో మీటింగ్.. ఆ తర్వాతే నిర్ణయం.. ఈసీ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఒక పెద్ద మీటింగ్ జరిగింది. కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి, న్యాయ మంత్రిత్వ శాఖ నుంచి శాసన కార్యదర్శి, MeitY కార్యదర్శి, UIDAI CEO వంటి ముఖ్య ప్రభుత్వ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సాంకేతిక సంప్రదింపులకు సంబంధించిన ప్రణాళిక గురించి ఈ మీటింగ్లో చర్చించారు. * టైమ్ లైన్ ఫిక్స్ కాలేదు.. తొందరేం లేదు.. ఆధార్-ఓటర్ ఐడీ అనుసంధానం కోసం ఎన్నికల సంఘం సాంకేతిక చర్చలు మొదలు పెడుతున్నా, దీనికి ఇంకా కచ్చితమైన గడువు తేదీ అంటూ ఏదీ లేదు. ఇది చట్టపరమైన భద్రతలు, సాంకేతిక అంశాలను పరిగణలోకి తీసుకుని చాలా నెమ్మదిగా, క్రమంగా జరిగే ప్రక్రియ అని ఈసీ తెలిపింది. ఆధార్-ఓటర్ ఐడీ లింకింగ్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడానికి ఇది ఒక ముఖ్యమైన అడుగు.
