సివిల్స్ అభ్యర్థులకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది. దరఖాస్తుల గడువును మరోసారి పొడిగించింది. అప్లికేషన్ తేదీని ఫిబ్రవరి 21 సాయంత్రం 6గంటల వరకు పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత ప్రకటించిన తేది ప్రకారం జనవరి 22న అప్లికేషన్స్ ప్రారంభం అయ్యాయి. ఫిబ్రవరి 11తో దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. అయితే ఆ తేదీని ఫిబ్రవరి 18 వరకు పొడగిస్తూ ఓ ప్రకటన జారీ చేసింది.
తాజాగా ఆ తేదీని మరో మూడు రోజుల పాటు అంటే ఫిబ్రవరి 21 వరకు పొడిగించింది. యూపీఎస్సీ తాజా నిర్ణయంతో అభ్యర్థులు 21వ తేదీ సాయంత్రం 6 వరకు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్స్ లో ఏవైనా పొరపాట్లు ఉంటే ఫిబ్రవరి 22 నుంచి 28వ తేదీ వరకు సవరించుకునేందుకు ఎడిట్ ఆప్షన్ కల్పించింది. ఇక 150 పోస్టులకు విడుదలైన ఐఎఫ్ఎస్(IFS) దరఖాస్తుల గడువు కూడా ఫిబ్రవరి 21 వరకు పొడిగిస్తూ యూపీఎస్సీ నిర్ణయం తీసుకుంది.
979 పోస్టుల భర్తీ కోసం సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2025(CSE 2025) జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేసింది. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష 2025 మే 25న జరుగుతుంది.
