అద్వితీయమైన ప్రదర్శనతో టీమిండియా మరోసారి విశ్వవిజేతగా నిలిచింది. అసాధారణ ప్రదర్శనతో ఓటమెరుగని జట్టుగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని సొంతం చేసుకుంది. ఆదివారం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ను ఓడించి ముచ్చటగా మూడో సారి ఈ మినీ ప్రపంచకప్ను ముద్దాడింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 251 పరుగులు చేసింది. మైకేల్ బ్రేస్వెల్(40 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 53 నాటౌట్), డారిల్ మిచెల్(101 బంతుల్లో 3 ఫోర్లతో 63) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ(2/45), కుల్దీప్ యాదవ్(2/40) రెండేసి వికెట్లు తీయగా… మహమ్మద్ షమీ(1/74), రవీంద్ర జడేజా(1/30) తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసి గెలుపొందింది. రోహిత్ శర్మ(83 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లతో) శతకం చేజార్చుకోగా.. శ్రేయస్ అయ్యర్(62 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 48) హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. కేఎల్ రాహుల్(33 బంతుల్లో ఫోర్, సిక్స్తో 34 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ (2/46), మైకేల్ బ్రేస్వెల్(2/28) రెండేసి వికెట్లు తీయగా.. రచిన్ రవీంద్ర, కైల్ జెమీసన్ చెరో వికెట్ పడగొట్టాడు.
రోహిత్ మార్క్ బ్యాటింగ్..
లక్ష్యచేధనకు దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. రెండో బంతినే తన ట్రేడ్ మార్క్ ఫుల్ షాట్తో సిక్సర్ తరలించిన రోహిత్ శర్మ దూకుడుగా ఆడాడు. శుభ్మన్ గిల్(31) నిదానంగా ఆడినా.. రోహిత్ వేగంగా పరుగులు రాబట్టాడు. దాంతో పవర్ ప్లేలోనే టీమిండియా వికెట్ నష్టపోకుండా 64 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 41 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని మిచెల్ సాంట్నర్.. గ్లేన్ ఫిలిప్స్ స్టన్నింగ్ క్యాచ్తో విడదీసాడు. శుభ్మన్ గిల్ను కళ్లు చెదిరే క్యాచ్తో పెవిలియన్ చేర్చాడు. దాంతో తొలి వికెట్కు నమోదైన 105 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
నిరాశపర్చిన కోహ్లీ..
ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ(1) మైకేల్ బ్రెస్వెల్.. వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. రివ్యూ తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. దాంతో వరుసగా రెండు ఓవర్లు మెయిడిన్ అయ్యి టీమిండియా బ్యాటర్లపై ఒత్తిడి పెరిగింది. రచిన్ రవీంద్ర బౌలింగ్లో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో రోహిత్ శర్మ స్టంపౌటయ్యాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్తో కలిసి శ్రేయస్ అయ్యర్ ఆచితూచి ఆడాడు.
ఆదుకున్న అయ్యర్..
ముందుగా ఓ భారీ సిక్సర్తో ఒత్తిడి తగ్గించిన అయ్యర్.. వీలుచిక్కిన బంతిని బౌండరీకి తరలించాడు. అతను ఇచ్చిన ఓ సునాయస క్యాచ్ను కైల్ జెమీసన్ నేలపాలు చేశాడు. అయితే ఆ కాసేపటికే శ్రేయస్ అయ్యర్ను మిచెల్ సాంట్నర్ పెవిలియన్ చేర్చాడు. దాంతో మళ్లీ మ్యాచ్ ఉత్కంఠగా మారింది. క్రీజులోకి వచ్చిన రాహుల్ సాయంతో అక్షర్ పటేల్ జట్టు స్కోర్ను 200 ధాటించాడు. కానీ అనవసర షాట్ ఆడి క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేరాడు. క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా ఓ భారీ సిక్సర్ బాదడంతో టీమిండియా విజయం లాంఛనమే అని అంతా అనుకున్నారు. కానీ అతను కూడా అనవసర షాట్తో పెవిలియన్ చేరాడు. బ్యాటింగ్కు వచ్చిన రవీంద్ర జడేజాతో కలిసి రాహుల్.. సింగిల్స్తో విజయం దిశగా జట్టును నడిపించాడు. జడేజా బౌండరీతో విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.
