Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం నాడు 57,863 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 31,030 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.04 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.శ్రీవారి దర్శనం స్థానికుల కోటా టోకెన్లను మే 4వ తేదీ అంటే ఆదివారం జారీ చేయనున్నారు టీటీడీ అధికారులు. ప్రతి నెలా మొదటి మంగళవారం (మే 6వ తేది) స్థానికులకు కల్పించే దర్శనంలో భాగంగా మే 4వ తేది ఆదివారం నాడు స్థానిక దర్శన కోటా టోకెన్లను విడుదల చేయనున్నారు.తిరుపతి స్థానికులకు మహతి ఆడిటోరియంలోని కౌంటర్లలోను, తిరుమల స్థానికులకు బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో వాటిని అందజేస్తారు. మొదట వచ్చిన వారికి మొదటి ప్రాతిపదికన తెల్లవారు జామున 5 గంటల నుండి శ్రీవారి దర్శన టోకెన్లు జారీ చేయనున్నారు.తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలకు చెందిన స్థానికులు తమ ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందాల్సి ఉంటుంది. స్థానికులకు ప్రతి నెలా మొదటి మంగళవారం శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించాలంటూ టీటీడీ పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
తిరుపతి లోకల్స్కు అలర్ట్
