జమ్ము కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత భారత ప్రభుత్వం ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమవుతోంది. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు ప్రణాళికలు చేస్తోంది. అందులో భాగంగానే సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు చేసింది.
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్- పాకిస్థాన్ మధ్య ఉన్న సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారత ప్రభుత్వం రద్దు చేసింది. నీటిని తక్షణమే నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది. 1960లో ఇండస్ వాటర్ ట్రీటీ ద్వారా భారత్, పాకిస్థాన్ ల మధ్య ఈ ఒప్పందం ఏర్పడింది.సింధూ నదీ జలాలు ఈ ఒప్పందం ఆధారంగా ఇరు దేశాలు పంచుకుంటాయి. అయితే తాజాగా ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
అయితే తాజాగా ఇదే విషయంపై కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ స్పందించారు. భారత్ నుంచి పాకిస్థాన్కు చుక్క నీటిని కూడా వెళ్లనీయబోమని స్పష్టం చేశారు. ఉగ్ర దాడితో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ భేటీలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఉగ్రదాడికి వ్యతిరేకంగా ప్రధాని మోదీ పలు ఆదేశాలను జారీ చేశారని.. వాటిని సమర్థవంతంగా అమలు చేస్తామని తెలిపారు. ఈ మేరకు ఉగ్రదాడులను సహించేది లేదని పాకిస్థాన్ను గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు. సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయం పూర్తిగా సమర్థనీయమైందని సీఆర్ పాటిల్ అన్నారు.
