ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే దేశంలోనే పురాతన ఆలయాల్లో ఒకటైన కేరళలోని తిరుమల్లం శ్రీ పరశురామ క్షేత్రాన్ని బుధవారం పవన్ కళ్యాణ్ సందర్శించారు. ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధికారులు ప్రధాన అర్చకులు పవన్కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
శ్రీమహా విష్ణువు దశావతారాల్లో ఆరవ అవతారమైన శ్రీపరశురాముడికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బ్రహ్మ, దుర్గాదేవి, సుబ్రహ్మణ్యస్వామి, మత్స్య మూర్తి, వేద వ్యాస, శివాలయం, శ్రీకృష్ణ ఆలయం, గణపతి ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వించారు.
ఈ సందర్భంగా దేవాలయంలో భక్తులు చేస్తున్న భజన కార్యక్రమాన్ని ఆద్యంతం వీక్షించిన పవన్ కళ్యాణ్.. భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. పవన్ కళ్యాణ్ వెంట ఆయన తనయుడు అకీరా నందన్, టీటీడీ బోర్డు సభ్యులు ఆనంద్ సాయి ఉన్నారు. అంతకుముందు కేరళలోని చొట్టనిక్కరలో ఉన్న శ్రీ ఆగస్త్య మహర్షి ఆలయం, ఆగస్త్య ఆశ్రమం సందర్శించారు పవన్. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
ఇక, దకిణాది రాష్ట్రాల ఆలయాల సందర్శన అనేది తన వ్యక్తిగత అంశమని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇది రాజకీయాలకు సంబంధం లేదని.. సుమారు నాలుగు సంవత్సరాల క్రితం చెల్లించుకోవాల్సిన మొక్కుల నిమిత్తం వచ్చినట్లు తెలిపారు. తన ఆరోగ్యం అంతగా సహకరించకున్నా రావాల్సి వచ్చిందన్నారు. కేరళతోపాటు తమిళనాడులోని ఆలయాను దర్శించుకుంటానని తెలిపారు.
