సింగరాయకొండలోని గీతం స్కూల్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8, 9 తేదీల్లో జరగబోయే “హ్యాకథాన్ 2025” కు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి పవన్ కళ్యాణ్ ను విద్యార్థులు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో కలిసి అధికారికంగా ఆహ్వానించారు.
విద్యార్థులు ఈ సందర్భంగా హ్యాకథాన్ ఉద్దేశ్యాన్ని వివరిస్తూ, ఇది యువతలో ఆవిష్కరణ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు గొప్ప వేదికగా నిలుస్తుందని తెలిపారు. ఉప ముఖ్యమంత్రితో పాటు, ప్రకాశం జిల్లా విద్యా శాఖ అధికారి A. కిరణ్ కుమార్, రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, బాపట్ల ఎంపీ కృష్ణ ప్రసాద్ తెన్నేటి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారిని కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు. అలాగే, జిల్లా కలెక్టర్ మరియు ఒంగోలు ఎంపీ లను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు.
ఈ హ్యాకథాన్లో రొబోటిక్స్, డ్రోన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, యాప్ డెవలప్మెంట్ విభాగాల్లో విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు. ముఖ్యంగా, ఆర్డ్యునో ఆధారిత ప్రాజెక్టులు, స్మార్ట్ డివైసెస్, సెక్యూరిటీ సిస్టమ్స్, హోమ్ ఆటోమేషన్, సేఫ్ లాకింగ్ అప్లికేషన్లు వంటి వినూత్న ప్రాజెక్టులు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
ప్రిన్సిపాల్ లక్ష్మణ్ మాట్లాడుతూ, హ్యాకథాన్ విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమాజానికి ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేసేందుకు దోహదపడుతుందని తెలిపారు. ముఖ్య అతిథుల హాజరుతో, యువత సాంకేతిక రంగంలో ముందుకు సాగేందుకు మరింత ఉత్సాహం పొందుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.