Visakhapatnam Steel Plant: రాష్ట్రానికే తలమానికంలా ఉంటూ వస్తోన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉద్యోగుల స్వచ్ఛంద పదవీ విరమణ అమలులోకి వచ్చింది. వీఆర్ఎస్కు యాజమాన్యం తెర తీసింది. తొలి దశలో 1,140 మంది ఉద్యోగులకు వీఆర్ఎస్ అనుమతి లభించింది. ఈ మేరకు వారికి నోటీసులు సైతం జారీ చేసినట్లు తెలుస్తోంది.
కిందటి నెలలో వీఆర్ఎస్ ప్రతిపాదనలను స్వీకరించింది వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం. మొత్తం 1,613 మంది వీఆర్ఎస్ కోసం దరఖాస్తు దాఖలు చేసుకున్నారు. వాటిని పరిశీలించడానికి ప్రత్యేకంగా ఓ కమిటీ ఏర్పాటు చేసింది అప్పట్లో. తాజాగా ఈ కమిటీ 1,140 మందిని వీఆర్ఎస్కు అర్హులుగా గుర్తించింది. మరో 386 మందికి ఆ అర్హత లేదని తేల్చి చెప్పింది. వారి దరఖాస్తులను తిరస్కరించింది.
మరో 87 మంది ఉద్యోగులు వీఆర్ఎస్కు అర్హులే అయినప్పటికీ వాళ్లంతా కూడా ఉన్నతాధికారులు కావడం వల్ల ఇప్పట్లో అనుమతి ఇవ్వకూడదని ఈ కమిటీ నిర్ణయించింది. ఫలితంగా వాళ్ల వీఆర్ఎస్ అమలు ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. వీఆర్ఎస్ తీసుకోనున్న 1,140 మంది ఉద్యోగుల ఆర్థికపరమైన సెటిల్మెంట్ల కోసం కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ 500 కోట్ల రూపాయలను కేటాయించింది.
ఇప్పటివరకు ఈ 1,140 మంది ఉద్యోగులు ఎంత కాలం నుంచి స్టీల్ ప్లాంట్లో పని చేస్తోన్నారు? వాళ్ల సర్వీస్ కాల వ్యవధి ఇంకా ఎంత కాలం మిగిలివుంది? అనే అంశాలను ప్రాతిపదికగా తీసుకుని వారికి ఆర్థిక సెటిల్మెంట్లు చేస్తుంది యాజమాన్యం. దీనికి అనుగుణంగా చెల్లింపులు ఉంటాయి. కాగా- వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న వాళ్లు నాలుగు రోజుల కంటే ఎక్కువ సెలవులు పెట్టకూడదని యాజమాన్యం ఆదేశించింది. అత్యవసర పరిస్థితుల్లో.. స్టీల్ ప్లాంట్ డైరెక్టర్ అనుమతి ఉంటేనే మరో మూడు రోజుల వరకు అదనంగా సెలవులను తీసుకోవచ్చని స్పష్టం చేసింది.
