Mahakumbh 2025: మహా కుంభ మేళా 2025 వైభవంగా కొనసాగుతోంది. ప్రయాగ్రాజ్లో పండగ వాతావరణం నెలకొంది. దేశం నలుమూలల నుంచీ వస్తోన్న కోట్లాది మంది భక్తులు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ వద్ద గంగా-యమున-సరస్వతి త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలను ఆచరిస్తోన్నారు. తమ మొక్కులు చెల్లించుకుంటోన్నారు. ఫలితంగా ఘాట్లన్నీ జనసంద్రం అవుతున్నాయి.
కిందటి నెల 13వ తేదీన మహా కుంభమేళా ఆరంభమైన విషయం తెలిసిందే. 45 రోజుల పాటు అంటే ఈ నెల 26వ తేదీ వరకు కొనసాగబోతోందీ అతిపెద్ద ఆధ్యాత్మికోత్సవం. దేశ విదేశాల నుంచి కోట్లాదిమంది భక్తులు పుణ్యస్నానాలను ఆచరిస్తోన్నారు. త్రివేణి సంగమం ఘాట్లన్నీ కూడా పోటెత్తాయి.
నేడు మాఘ పౌర్ణమి. ఈ సందర్భంగా త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలను ఆచరించడానికి లక్షల సంఖ్యలో భక్తులు ప్రయాగ్ రాజ్కు చేరుకుంటోన్నారు. దేశం నలుమూలల నుంచీ భక్తజనం త్రివేణి సంగమానికి వస్తోన్నారు. అర్ధరాత్రి నుంచే పుణ్యస్నానాలు చేయడం ఆరంభించారు. తొలి రెండు గంటల్లోనే లక్షలాదిమంది భక్తులు పుణ్యస్నానం చేశారు. జనవరి 13వ తేదీ నుంచి ఈ నెల 11వ తేదీ అంటే మంగళవారం వరకు 46 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలను ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. మాఘ పౌర్ణమి సందర్భంగా మరో 10 నుంచి 15 లక్షల మందికి పైగా భక్తులు ప్రయాగ్రాజ్కు వస్తారని అంచనావేసింది. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేసింది. భక్తల తాకిడిని దృష్టిలో ఉంచుకుని ప్రయాగ్రాజ్, త్రివేణి సంగమం ఘాట్లన్నింటినీ నో వెహికల్ జోన్గా ప్రకటించింది ప్రభుత్వం. ఘాట్లకు వెళ్లే మార్గాలన్నింట్లో వాహనాల రాకపోకలను నిషేధించింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే అన్ని రకాల వాహనాలు కూడా నగరం బయటే నిలిపివేయాల్సి ఉంటుంది. త్రివేణి సంగమం నోస్ పాయింట్తో పాటు ఇతర ఘాట్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
విదేశీయుల తాకిడి సైతం మొదలైంది. ఈ తెల్లవారు జామున తొలి ఘడియలోనే రష్యా, క్రొయేషియా, బ్రిటన్, ఫ్రాన్స్కు చెందిన పలువురు భక్తులు త్రివేణి సంగమంలో స్నానాన్ని ఆచరించారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాల పట్ల తమకు ఉన్న గౌరవాన్ని చాటుకుంటోన్నారు. మహా కుంభ మేళాలో అమృత్ స్నానాన్ని ఆచరించడాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. మకర సంక్రాంతి తొలి అమృత్ స్నాన పర్వదినం. దీని తరువాత మౌని అమావాస్య, వసంత పంచమి, మాఘి పూర్ణిమ, మహా శివరాత్రి.. ఈ నాలుగు పుణ్య ఘడియల్లో తప్పనిసరిగా త్రివేణి సంగమ స్నానం చేయాలంటూ పురాణాల్లో ఉందని సాధవులు చెబుతున్నారు.
